ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీన్ రివర్స్ అయ్యింది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టబోయిన జగన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొదట్లో చంద్రబాబను జగన్ తనవెంట లాక్కెళ్లితే.. ఇప్పుడు జగన్ను చంద్రబాబు లాక్కెళ్తున్నారు. జగన్ వేసిన ఒకేఒక్క తప్పటడుగుతో ఏపీ రాజకీయాన్ని మొత్తం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడా చక్రబంధంలో నుంచి బయటపడేందకు ప్రతిపక్ష నేత నానాతంటాలు పడుతున్నారు. ఏపీ రాజకీయ చదరంగంలో ప్రస్తుతానికైతే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవమే గెలిచిందనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి.. ఎన్డీయేలో టీడీపీ కొనసాగినంతకాలం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్దే పైచేయిగా ఉంది. ఒకసారి ప్రత్యేక హోదా కావాలని, మరోసారి అవసరం లేదనీ, ఇంకోసారి ప్యాకేజీ ఇస్తే సరిపోతుందనీ.. ఇలా పొంతన లేని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును జగన్ ఇరకాటంలోకి నెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచారు.. హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో జగన్ మరో అడుగు ముందుకు వేసి.. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు.
ఒకదశలో వైసీపీకి చంద్రబాబు కూడా మద్దతు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఇక్కడివరకూ జగన్ కోర్టులోనే బంతి ఉంది. అయితే ఇక్కడే జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హోదా నినాదాన్ని బలంగా వినిపిస్తున్న జగన్ ఒక్కసారిగా బీజేపీకి దగ్గరవుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు తామే స్వయంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని ప్రకటించడం గమనార్హం. ఇక ఇక్కడి నుంచే చంద్రబాబు పైచేయి సాధిస్తూ వస్తున్నారు.
వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టినా చంద్రబాబు వాటిని రాజీడ్రామాలు కొట్టిపారేశారు. ఒకేసమయంలో బీజేపీని, వైసీపీని, వీటి రెండింటి మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ఆంధ్రుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా.. ఏపీకి నమ్మక ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని బలంగా వినిపిస్తున్నారు. హోదా సాధన కోసం నిరంతర కార్యాచరణతో జనంలోకి వెళ్తున్నారు.
మరోవైపు స్పీకర్ ఫార్మెట్లోనే వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు రాజీనామాలు చేసినా... వాటిని ఇప్పటివరకూ ఆమోదించకపోవడానికి బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న రహస్య అవగాహనే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. ఇది నిజమేనన్నట్లుగా కర్ణాటకలో ఎంపీలు యడ్యూరప్ప, బీ శ్రీరాములు చేసిన రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించడం.. వైసీపీ ఎంపీల రాజీనామాలను ఇప్పటికీ అమోదించకపోవడాన్ని కూడా టీడీపీ నేతలు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఒత్తిడితో వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరే పరిస్థితి వచ్చింది. బుధవారం స్పీకర్తో సమావేశం అవుతున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లోక్సభలో ప్రధాని మోడీ కాళ్లకు మొక్కడం.. విజయవాడలో కేంద్రం మంత్రి రాందాస్ అథవాలె జగన్ను బలమైన నాయకుడంటూ పొగడడం.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ క్యాంపు రాజకీయాలకు జగన్ సహకరించడం.. కేంద్రాన్ని, మోడీని పల్లెత్తు మాట అనకుండా.. కేవలం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆందోళనలు చేయడం.. ఈ విషయాలన్నీ వైసీపీ-బీజేపీ మధ్య కుదిరిన రహస్య ఒప్పందానికి నిదర్శమన్నవిషయాన్ని చంద్రబాబు బలంగా వాదిస్తూ ఏపీ రాజకీయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో జగన్ అయోమయంలో పడిపోయారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.