కేరళను వణికిస్తున్న నిపా వైరస్ మెల్లగా పక్క రాష్ట్రాలకూ వ్యాపించే ప్రమాదం కనిపిస్తున్నది. దీంతో కేరళను ఆనుకునే ఉండే గోవా రాష్ట్ర ఆరోగ్యశాఖ అన్ని హాస్పిటల్స్లో హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ నుంచి వచ్చే టూరిస్టులు కొంతమందిని పరీక్షిస్తున్నట్లు కూడా గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రానె వెల్లడించారంటేనే వైరస్ తీవ్రత అర్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఈ నిపా వైరస్ గురించి కేరళ ప్రభుత్వంతో గోవా ఆరోగ్య శాఖ సంప్రదింపుతు జరుపుతున్నది. కేరళ నుంచి గోవాకు రైళ్లలో వస్తున్న ప్రయాణికులను పరీక్షిస్తుండాలని గోవా ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నతాధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను హైఅలర్ట్లో ఉంచారు.
ముంబాయికీ ప్రమాద ఘంటికలు
రాబోయే రోజుల్లో ఈ వైరస్ గోవా ముంబయికీ పాకే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ వైరస్ కారణంగా ముగ్గురు చనిపోగా ఒకరు చికిత్స తీసుకుంటున్నారు.. మరో మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. అనధికారికంగా సుమారు 12 మంది చనిపోయారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్రం ఓ ఉన్నతస్థాయి వైద్య బృందాన్ని కేరళకు పంపించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గతంలో ఇండియాలో ఈ నిపా లక్షణాల్లో మనుషుల్లో కనబడింది.
కేరళలో తీవ్ర విషాదం
రాష్ట్రంలో ఓ వైపు నిపా వైరస్ విజృంభిస్తుంటే మరోవైపు ఆ వ్యాధికి చికిత్స చేస్తున్న నర్సులు సైతం బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే ముగ్గురు నర్సులు వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరారు. లినీ అనే నర్సు చనిపోవటం అందర్నీ షాకింగ్ కు గురి చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమె కుటుంబంతో సన్నిహుతల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. వైరస్ సోకి ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచిన లినీని నిముషాల వ్యవధిలోనే ఖననం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు చివరి చూపుకు కూడా అవకాశం లేకుండా చేశారు.
వైరస్ సోకకూడదనే
చనిపోయిన నర్సు నుండి ఇతరులకు ఈ వైరస్ సోకకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు డాక్టర్లు , అధికారులు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అయినా తప్పలేదన్నారు వైద్యులు. లినీని చివరి చూపునకు అవకాశం ఇస్తే మిగతా వారికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అందుకే నిమిషాల్లోనే ఖననం పూర్తి చేసినట్లు ప్రకటించారు అధికారులు. మృతి చెందిన నర్సు లినీ తన భర్తకు రాసిన చివరి లేఖ రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది.
చావు తప్పదని తెలుసు
నిఫా వైరస్ రోగులకు చికిత్స చేస్తుండగా ఆ వైరస్ తనకు కూడా సోకింది. ఆ విషయాన్ని తాను గ్రహించానని చికిత్స లేని వైరస్ వల్ల తనకు మరణం తప్పదని తనకు బాగా తెలుసంటూ నర్సు లేఖలో పేర్కొనటం అత్యంత విషాధాంతం. కొన్ని గంటల్లోనే చనిపోతానని తనకు తెలుసని అయినా చివరిసారిగా భర్త, పిల్లల్ను కూడా చూడలేక పోవటమే తనను కలచివేస్తోందని నర్సు పేర్కొనటం గుండెలను పిండేస్తోంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని, వారిని గల్ఫ్ తీసుకెళ్ళి బాగా పెంచాలని భర్తను కోరింది. తాను లేనని బాధ పడుతూ జీవితాంతం ఒంటరిగా ఉండవద్దని కోరారు. తన నాన్నలాగ జీవితాన్ని ఒంటరిగా గడపద్దంటూ ధైర్యం చెబుతూ భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరిని కలచివేస్తోంది.
వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన రోగికి మెదడు, గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం కనబడుతుంది. గబ్బిలాలు, గుడ్లగూబలు, పందుల ద్వారా ఈ వ్యాధి సోకుతుందని నిర్ధారించారు. వైరస్ సోకిన వారికి తరచూ జ్వరం, ఊపిరి తీసుకోవటంలో తేడా, మానసిక స్దితి సరిగా లేకపోవటం, బలహీనత, కండరాల నొప్పులు, మూర్చ లక్షణాలు కనబడుతాయి. మంచినీటిని, వాడుక నీటి వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేరళ-విశాఖపట్నం మధ్య రాకపోకలు ఎక్కువగా ఉన్నందును ప్రభుత్వం విశాఖలోని ఆసుపత్రులను, జనాలను ముందుగా అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్తగా విశాఖలోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.