టీజీఏసీ చైర్మన్ కోదండరాం త్వరలోనే కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మాస్టారు గారు తన కొత్త పార్టీ పేరు, గుర్తు, విధి విధానాలు ఖరారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక కోదండరాం వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది కూడా చర్చకు రావడం సహజమే. మనకు వినపడుతోన్న సమాచారం ప్రకారం ఆయన పాత ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ ద్వారా ఎంతో కీలకపాత్ర పోషించిన కోదండరాం మాస్టారుకు విద్యా, ఉద్యోగ వర్గాలతో పాటు మేథావులు, యువతలో మంచి క్రేజ్ ఉంది. తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. చివరకు విపక్షాలతో పాటు సామన్యుల నుంచి కూడా ఈ విషయంలో కోదండరాంకు పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది.
ఇక కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న కోదండరాం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కోదండరాం ఎక్కడికి వెళితే అక్కడ ప్రభుత్వం అడ్డంకులు సైతం క్రియేట్ చేస్తోంది. చివరకు కేసీఆర్ ఫ్యామిలీతో పాటు కేసీఆర్ సైతం కోదండరాంను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇక కోదండరాం పోటీ చేయాలనుకుంటోన్న మంచిర్యాల నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున దివాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన గెడ్డం అరవింద్రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి ఓడిపోయారు.
ఇక కోదండరాం కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పోటీ చేసేందుకు సేఫ్ సీటు అయితే బెటర్ అని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న మంచిర్యాల నియోజకవర్గం అయితే తనకు కరెక్ట్ అని ఆయన భావించే మంచిర్యాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆయన స్వస్థలం అక్కడే ఉండడంతోనే కోదండరాంకు మంచిర్యాల మీద గురి ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అయితే కోదండరాం మంచిర్యాల నుంచి పోటీ చేస్తారన్న వార్తలపై టీ జేఏసీ వర్గాలు స్పందిస్తూ దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.