ప్రతిష్ఠాత్మక ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జరుగనుండటంతో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ఏడాది అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. గత ఏప్రిల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడింది. మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది.
ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్రంలో ఎప్పుడూ వివాదాలకు కేంద్రబింధువువైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి.
ఈ ఎన్నికలో పోటీ దినకరన్కు, డీఎంకేకి మధ్యనే ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అంతేకాదు, దినకరన్ గెలిచి డీఎంకే నేత స్టాలిన్కు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. అంతే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్దరూ అసమర్థులని అన్నారు. డీఎంకే పార్టీ హిట్లర్ పార్టీ అని, దాని నుంచి దినకరన్ మాత్రమే ప్రజలను కాపాడగలడని అన్నారు.