దేశంలో నిజాన్ని నిర్బయంగా రాసే పరిస్థితులు పాత్రికేయులకు లేవు: రాహుల్ గాంధి




భారత్ లో జర్నలిస్టులు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిజాలు రాసే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధి విమర్శించారు. నరెంద్ర మోదీ నేతృత్వంలోని బాజపా కేంద్ర ప్రభుత్వం మీడియా యాజమాన్యాలను, వారి పాత్రికేయులను, అధికారులను  భయపెట్టడంతోపాటు దళితులు, మైనారిటీలను అణచివేస్తూ తమ నియంతృత్వ పోకడలతో అందరి నోళ్ళు మూయిస్తోందన్నారు. 


తమ కుటుంబ అద్వర్యంలోని "నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక" స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన పునః ప్రారంభ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌  "సత్యానికుండే గొప్ప శక్తిని బాజపా ప్రభుత్వం అణగదొక్కు తుందన్నారు. ఎవరైనా నిజం మాట్లాడాలని ప్రయత్నిస్తే వారిని పక్కకు నెట్టేస్తున్నారు. వేల మంది పాత్రికేయులు వారు రాయాలనుకున్నది రాసే పరిస్థితుల్లేవు" అని అన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌లో పనిచేసే పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తప్పు ఎక్కడ జరిగినా ప్రజలు తెలియజేయటంలో వీరిపై ఎలాంటి ఒత్తిడులూ ఉండవన్నారు. 


పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ఇంగ్లీషుతో పాటుగా హిందీ, ఉర్దూ భాషల్లో తీసుకు రానున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఈ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్‌ హెరాల్డ్‌ 70 ఏళ్ల స్మారక సంచికను రాహుల్ గాంధి, ఉప-రాష్టృఅపతి హమెరెద్ అన్సారీ తదితరులు విడుదల చేశారు.


దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు భారత మీడియాకు స్వేచ్ఛ అవసరమని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛతోనే సమాజానికి మేలు జరుగు తుందన్నారు. మీడియా, జర్నలిస్టులపై ఇలాంటి దాడుల వల్ల మీడియా స్వీయ నియంత్రణ కోల్పోవాల్సివస్తుందన్నారు. తాజాగా ఎన్డీటీవీపై సీబీఐ దాడుల నేపథ్యంలో అన్సారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను "వీధి రౌడీ" అని సంబోధించిన కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ను రాహుల్‌ తీవ్రంగా మందలించారు. "భారత ఆర్మీ దేశం కోసం పనిచేస్తుంది. అలాంటి వ్యవస్థపై రాజకీయ నేతలెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. ప్రజలు ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయొద్దు" అని రాహుల్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: