తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధులు
కేంద్ర సాధారణ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేక పోయినా.. రైల్వే బడ్జెట్ లో మాత్రం కాస్త ఊరటనిచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. పలు నూతన రైల్వే లైన్ల సర్వేకు అనుమతిచ్చారు.
మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతినిచ్చింది కేంద్రం. మంచిర్యాల-గడ్చిరోలి మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి లభించింది. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ సర్వేకు సైతం అనుమతి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మునీరాబాద్-మహబూబాబాద్ రైల్వేలైన్ నిర్మాణం కోసం రూ.300కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య రైల్వేలైన్కు రూ.350కోట్లు నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్కు రూ.340కోట్లు, అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వేలైన్కు రూ.196 కోట్లు కేటాయింపులు జరిపింది.
అలాగే యాదాద్రి-ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.16కోట్లు, కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్కు రూ.240కోట్లు, కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్కు రూ.150కోట్లు, గుంటూరు-గుంతకల్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.124కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్కు రూ.430 కోట్లు, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్కు రూ.100 కోట్లు, గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు, తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు, మంచిర్యాల- పెద్దపల్లి మధ్య మూడో లైన్కు రూ.100కోట్లు, విజయవాడ-అమరావతి మధ్య రైల్వేలైన్కు రూ.2680కోట్లు కేటాయింపులు చేశారు.
గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు, విజయవాడ-గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు, చర్లపల్లిలో శాటిలైట్ స్టేషన్కు రూ.5కోట్లు, ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్లకు రూ.19 కోట్లు, తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి, కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్కు అనుమతినిచ్చింది కేంద్ర రైల్వే శాఖ. మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్కు సర్వేకు కూడా ఓకే చెప్పింది. హిందూపురం-చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్కు సర్వేకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే విశాఖ రైల్వే జోన్ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్ర సర్కార్.