రఘురామ అంటే వైసీపీ భయపడుతోందా..?
రఘురామరాజు నియోజకవర్గంలో పరిస్థితులను అంచనా వేసుకుని పూర్తి సన్నద్ధతతోనే రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అయితే ఆయనను నిలువరించడమెలాగో వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే రఘురామ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న సమయంలో బుధవారం ఏపీ సీఐడీ అధికారులు మళ్లీ నోటీసులిచ్చేందుకు హైదరాబాద్లోని రఘురామరాజు ఇంటి తలుపులు తట్టారు. ఆయనపై గతంలో ఉన్న కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే రఘురామ బయటకు రాకపోవడంతో ఆయన లాయర్లతో సీఐడీ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో మాదిరిగా ఎంపీని బలవంతంగా అరెస్టుకు చేసేందుకు వీలులేదు. ఎందుకంటే ఆవిధంగా సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఏపీ ప్రభుత్వ వైఖరితో ఎంపీ రఘురామరాజు నియోజకవర్గంలో పర్యటిస్తే ఏమవుతుందన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.