వణికిస్తున్న కరోనా గణాంకాలు.. కర్ఫ్యూలు తప్పవా..?
ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం.. మరోవైపు పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న ఆందోళన కనిపిస్తోంది. మారుతున్న పరిస్థితులతో కేంద్రం కూడా మేలుకుంది. కరోనా నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారు.
మరోవైపు దేశంలోని తాజా కరోనా గణాంకాలు భయపెడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. గత రెండు వారాలుగా ఈ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. అందుకే ఈ 27 జిల్లాలపై ఫోకస్ పెట్టాలని కేంద్రం చెబుతోంది. ఆ పది రాష్ట్రాలు ఏంటో తెలుసా.. అవి..కేరళ, మిజోరం, సిక్కింలోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటిందట. మరో 7 రాష్ట్రాలలోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా ఉంది.
ఈ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. కేసులు, పాజిటివిటీ రేటు పెరిగిన జిల్లాల్లో వెంటనే వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలనిసూచించింది. ఆయా ప్రాంతాల్లో పరీక్షలు పెంచాలని.. అలాగే వ్యాక్సినేషన్ కూడా పెంచాలని కేంద్రం చెబుతోంది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని కేంద్రం సూచిస్తోంది.