దేశ రాజకీయాలను మలుపు తిప్పే రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైంది ఉత్తరప్రదేశ్.. ఎందుకంటే దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం. దీంతో ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీనే కేంద్రంలో కీలక భూమిక పోషిస్తుంది. అలాగే, యూపీని పాలిస్తున్న పార్టీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని అందరికి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు, మీడియా ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీనివల్లే యూపీలో ఏ చిన్న సంఘటన జరిగినా దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
రాబోయే ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలని ఆశపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ సారి ఎలాగైన తన ప్రభావం చూపి తిరిగి పాత ఫామ్లోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. ఎస్పీ, బీఎస్పీ ఇతర పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికలపై సర్వేలు కొనసాగుతున్నాయి. యూపీ ప్రజలు ఎవరికి పట్టం కాట్టాలనుకుంటున్నారు..? ఈసారి సీఎం సీటుపై ఎవరు కూర్చుంటారు.? అనే విషయాలపై పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి ప్రజల పల్స్ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏబీపీ సీఓటర్ సర్వే సంస్థ చేసిన సర్వేలో యోగి మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించింది. 44 శాతం మంది ప్రజలు యోగిని సీఎంగా చేసేందుకు మద్ధతు ప్రకటించారు.
ఏబీపీ సీఓటర్ సర్వేలో 31 శాతం మంది సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి కొరుకున్నారని తెలిపింది. అలాగే, 15 శాతం యూపీ ప్రజలు బీఎస్పీ అధినేత్రి మాయవతి సీఎం కావాలని కోరుకున్నారట. ఈ సర్వే ఆధారంగా.. యూపీలోని 43 శాతం మంది ప్రజలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపైతీరుపై సంతృప్తిగా ఉన్నారు. 21 శాతం మంది పర్వాలేదని అభిప్రాయపడగా, 36 శాతం మంది ప్రజలు యోగి పనితీరు చెత్తగా ఉందన్నారు. అయితే, ఈ సర్వే అంచనాలతో మరోసారి బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ సీఎంగా కాబోతున్నాడని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.