తెలంగాణ: పాపం ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం దేవులాడుతున్న బీఆర్ఎస్?

Suma Kallamadi
పాపం బీఆర్ఎస్ ని వెంటాడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలోనే 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉప ఎన్నిక దూసుకు వచ్చింది. అదే ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉపఎన్నిక. సరిగా 3 సంవత్సరాల క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఈ స్థానం దక్కించుకున్నారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించగా ఆ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉపఎన్నిక రానే వచ్చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఆయన గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు. కాగా బీఆర్ఎస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం.
అందులోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక కావడంతో వారికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే గెలవడం అయితే వారికి తప్పనిసరి. కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఎవరిని దింపాలన్నది సమస్యగా మారింది. ఎవరూ పోటీకి ముందుకు రావడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. ప్రచార గడువు కూడా లేదు. మే రెండోతేదీ నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. కాగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరుగుతుందనే విషయం అందరికీ తెలిసినదే.
వారు గనక అక్కడ అభ్యర్థిని నిలబెడితే గెలవాలి, లేదంటే కనీసం రెండో స్థానంలో ఉండాలి. అంతేగాని కనీస ఓట్లు కూడా రాకపోతే మాత్రం పరువు పోతుంది. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికికే పెద్ద సమస్య వస్తుంది. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ ది అదే పరిస్థితి. పోటీ చేస్తే కనీస ఓట్లు వస్తాయన్న నమ్మకం కూడా పార్టీలో లేదని గుసగుసలు వినబడుతున్నాయి. పోనీ పోటీ చేయకపోతే పారిపోయారని అంటారు. ఏం చేయాలన్నది వారం రోజుల్లో డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది, అయితే ఈలోగా పుణ్యకాలం గడిచిపోకుండా ఏం చేస్తారో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: