1995 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారిగా ఎన్నో సేవలు అందించారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కార్యదర్శి గా నియమించబడి గురుకులాల్లో తన మార్క్ వేసుకున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు పై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రూపొందించిన ప్రణాళికలు ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి. ఆయన వల్లే తెలంగాణ గురుకులాలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో మావో ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల రక్తపు మరకలను తుడిచి వేసుకునేందుకే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ప్రజాసేవలో కి... రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించారు. దానిని ఆర్ ఎస్ ప్రవీణ్ ఖండిస్తూ.... ఆ స్థానంలో ఏ అధికారి ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తారని చెప్పారు. కానీ తనను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రశ్నలను వేరే అధికారులను ఎందుకు అడగరు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తాను దళితుల కోసం అట్టడుగు వర్గాల వారికోసం మాట్లాడుతున్నానని తనపై కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరియమ్మ పై ఏ విధంగా కుట్ర జరిగిందో తనపై కూడా అలాంటి కుట్రనే తనపై కూడా జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతేకాకుండా పరిటాల రవి హత్య కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయని యాంకర్ ప్రశ్నించగా... దానిపై కూడా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తాను పెన్నును నమ్ముకున్నాను అని అన్నారు. తనపై ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్ ను క్రియేట్ చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై దాడులకు దిగినా కూడా ఎలాంటి ప్రభావం ఉండకూడదని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాను కాన్షీరామ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ల బాటలో నడుస్తానని చెప్పారు.