ఎన్వీ రమణపై బార్‌ కౌన్సిల్‌ ప్రశంసల వర్షం..?

Suma Kallamadi
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ.. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయిన లాయర్లకు సాయం అందించాలని భారత కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనితో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఎన్వీ రమణ కేంద్రానికి లేఖ రాయడంపై సంతోషం వ్యక్తం చేసిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎన్వీ రమణ నేతృత్వంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

"చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ లాయర్లకు నేతృత్వం వహిస్తున్న సీజేఐ దయా హృదయంతో సాటి న్యాయవాదులు అనుభవిస్తున్న బాధల గురించి స్పందించారు. న్యాయవాదుల ఇబ్బందుల పట్ల ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఒకటిన్నర సంవత్సరాలుగా కోర్టులు మూసివేశారు. దీనితో న్యాయవాదులు అత్యంత దయనీయమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితుల గురించి పడుతున్న ఆవేదనకు సీజేఐ లేఖ అద్దం పడుతోంది. అటువంటి వారికి సహాయం అందించాలని సీజేఐ కోరడం నిజంగా ప్రశంసనీయం. సీజేఐ లేఖతో కేంద్రం స్పందించి న్యాయవాదులను రక్షించడానికి ముందుకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము" అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది.

"భారత న్యాయ వ్యవస్థకు ఎన్వీ రమణ వంటి డైనమిక్ బార్-ఫ్రెండ్లీ చీఫ్ జస్టిస్ అవసరం ఉంది. అతను ఒక సాధారణ న్యాయవాది యొక్క వాస్తవికతలను బాగా అర్థం చేసుకున్నారు." అని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ మనన్‌కుమార్‌ మిశ్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఎన్వీ రమణ మారుమూల ప్రాంతాల్లోని న్యాయవాదుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన బార్‌ కౌన్సిల్‌.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతరాయమైన ఇంటర్‌నెట్‌ సౌకర్యం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిని అభ్యర్థించడం సీజేఐ వేసిన ఓ విప్లవాత్మక ముందడుగు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: