మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్పందించారు. దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైందని అన్నారు. వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి ఎక్కడెక్కడ శాశ్వత డ్యామేజ్ లు జరిగాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు సింహచలం దేవస్థానం గోశాలలోని గోవుల ప్రాణాలు పోయాయని.....వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారని ఆరోపించారు. ఆ గోవుల ప్రాణాలు ఎవరు తెస్తారు? అంటూ ప్రశ్నించారు. అలాగే దేవాలయాల్లో పరిస్థితులు చూడాలన్నారు. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని రిస్టోర్ చేయాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం కూడా తనకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలని వ్యాఖ్యానించారు. ట్రస్టు చైర్మన్ తో పాటు సింహచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి నుంచి తనను తొలగించారని...డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసిందంటూ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు రావడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. తాను రామతీర్ధాలు, దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయని వాదించారు. కానీ ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని చెప్పారు. కోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తరవాత మిగతా వివరాలు వెల్లడిస్తానని అశోక్ గజపతి రాజు అన్నారు. అశోక్ గజపతిరాజు ని ఇబ్బంది పెట్టడానికి పాపం సామాన్యులను, ఉద్యోగులను, సిబ్బందిని చాలా ఇబ్బందికి గురిచేశారంటూ వ్యాఖ్యానించారు. మూగ జీవులను హింసించారు, గోవులను చంపారు ఇది దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలు జరగటం బాధాకరంగా ఉందన్నారు. తన పై పగ తోనే మాన్సస్ కార్యాలయాన్ని తరలించారని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ అనేది ప్రజల కోసం పుట్టిన సంస్థ అని చెప్పారు.