కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

Suma Kallamadi
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ వల్ల ఏ ఉపయోగం ఉండదని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే రెమ్‌డెసివిర్‌ సమర్థతపై సంచలన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కారణంగా కోవిడ్ 19 వ్యాధి నుంచి రోగులు కోలుకుంటారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఒక డాక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మంగళవారం రోజు గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా మాట్లాడుతూ కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ మందులు తొలగించాలని సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగులకు అందించే చికిత్సలో రెమ్‌డెసివిర్‌ సమర్థతపై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.

"ప్లాస్మా థెరపీలో.. కరోనా రోగుల్లో వైరస్ తో పోరాడే యాంటీబాడీస్ ఏర్పడాలని ప్రీ ఫార్వర్డ్ యాంటీ బాడీస్ ఇస్తాము. కానీ కరోనా వైరస్ వచ్చినపుడు సహజంగానే శరీరంలో యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయి. ప్లాస్మా థెరపీ కారణంగా రోగుల ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి తేడా కనిపించదని గత ఏడాదే మేము తెలుసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ప్లాస్మా థెరపీ ప్రారంభించాము. ప్లాస్మా థెరపీ పనితీరు యొక్క సాక్ష్యాల ఆధారంగా దానిని నిలిపివేశాము...."

"ప్లాస్మా థెరపీని మినహాయించి కరోనా చికిత్సలో ఇతర మందుల గురించి మాట్లాడుకుంటే.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కరోనా చికిత్సలో పనిచేస్తాయి అని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చికిత్సలో పనిచేయని మందులను వెంటనే నిలిపివేయాలి. రెమ్‌డెసివిర్‌ గానీ, ప్లాస్మా గానీ.. చికిత్సలో పనిచేయని ప్రయోగాత్మక మందులన్నీ త్వరలోనే నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి, " అని ప్రముఖ డాక్టర్ డిఎస్ రానా చెప్పుకొచ్చారు.

ఇకపోతే కరోనా రోగులకు సంజీవని గా మారిన ఆక్సిజన్ సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ప్రాణాలు కాపాడుతుంది అని అందరూ భావించారు కానీ వైద్యులు దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మరోవైపు ప్లాస్మా థెరపీ నిలిపివేయాలని ఐసీఎంఆర్ ప్రకటించింది కానీ భారతదేశంలో ప్లాస్మా దాతల కోసం చాలామంది కరోనా రోగులు వెతుకుతూనే ఉన్నారు. 2-డీజీ డ్రగ్ అయినా కరోనా చికిత్సలో సమర్థవంతమైన పనితీరు చూపిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: