మావోయిస్టులను కబళిస్తున్న కరోనా.. పోలీసుల బంపర్ ఆఫర్..?

Chakravarthi Kalyan
కరోనా అన్ని రంగాల వారిపై ప్రభావం చూపుతోంది.. కరోనా ప్రభావం ఇప్పడు మావోయిస్టులపైనా చూపుతోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. వారి వైద్యం కోసం అడవుల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకే ఇప్పుడు వారు మావోయిస్టులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు జనజీవన స్రవంతి కలుస్తున్నట్టు ప్రకటిస్తే.. వారికి మంచి వైద్య సదుపాయం, పునరావసం అందిస్తామని ప్రకటన చేస్తున్నారు.
ఆంధ్ర - చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పలువురు మావోయిస్టులకు  కరోనా సోకినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసు  నిఘా వర్గాలకు ఉన్న సమాచారం మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గాలికొండ దళం,  బీకే, ఈజీ డీవీసీ దళం , కుంట ఏరియా కమిటీ దళాలకు చెందిన మావోయిస్టు నాయకులకు, దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు కరోనా సోకిందని పోలీసులు చెబుతున్నారు.
కరోనా సోకిన మావోయిస్టులు దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు తదితర  సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మావోయిస్టులు  జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరితే... కరోనాకి సరైన చికిత్సను సకాలంలో ఉచితంగా పొందవచ్చంటున్నారు  తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ  అద్నాన్ నయీం అస్మి.. మావోయిస్టు అగ్రనాయకులు  దళ సభ్యులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన సూచిస్తున్నారు.
మావోయిస్టు దళ సభ్యులు, నాయకులు సరైన నిర్ణయం తీసుకొని పోలీసులను  ఆశ్రయిస్తే  చికిత్సకు, ప్రాణాలకు,  పునరావాసానికి భరోసా కల్పిస్తామంటున్నారు  తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. ఏదేమైనా పోలీసులు కరోనా సమయాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.  మరి పోలీసుల ఆఫర్‌ను మావోయిస్టులు పరిగణలోకి తీసుకుంటారా.. అడవులను వదిలి జన జీవనంలోకి వచ్చి కరోనా చికిత్స పొందుతారా.. అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: