గురుమూర్తిపై అనర్హత? తిరుపతి ఎన్నికలో ట్విస్ట్!
అయితే తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ కు కొన్ని గంటల ముందు ట్విస్ట్ నెలకొంది. ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వర్చువల్ విధానంలో వారు తమ ఫిర్యాదును సీఈసీకి నివేదించారు. తిరుపతి బరిలో పోలింగ్ భద్రత, తదితర అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను రాజకీయ లబ్దికి వినియోగిస్తున్నారని బీజేపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాదు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పోటీకి అనర్హుడని సీఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ నేతలు. గురుమూర్తి అన్యమతానికి చెందిన వ్యక్తి అనేందుకు తగిన ఆధారాలను అందజేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ...గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని సీఈసీని కోరామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. తిరుపతిలో ఈ నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందు వైసీపీ అభ్యర్థిపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా పోటీకి గురుమూర్తి అనర్హుడని బీజేపీ ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తున్నది ఆసక్తి రేపుతోంది.