ఆమంచి ' కి ఎడ్జ్ వచ్చేసిందా... చీరాలలో ఏం జరుగుతోంది..?
వైసీపీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేస్తున్నారు. కానీ, ఈయన అద్దంకి నుంచి దిగుమతి అయిన సరుకు గానే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. మరోవైపు.. ఎప్పుడో మూడేళ్ల కిందటే ఇంచార్జ్ పదవి ఇచ్చినా.. ఆయన గ్రూపు రాజకీయాలతోనే సరిపుచ్చారు. పైగా.2021లో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా సత్తా చూపించ లేక పోయారు. అప్పట్లోనూ ఆమంచి.. తన వర్గాన్ని సొంతంగా నిలబెట్టి.. వైసీపీ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుని.. వారిని గెలిపించుకున్నారు. ఇది కరణంకు మైనస్ అయింది.
ఇక, టీడీపీ నుంచి బరిలో ఉన్న కొండయ్య యాదవ్ బీసీలను ఏమైనా ప్రభావితం చేస్తే బాగానే ఉంటుంది. కానీ.. ఆయన కూడా నియోజకవర్గానికి కొత్త కావడంతో.. ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడో 2009లో ఒంగోలులో ఓడిపోయిన కొండయ్య ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక చంద్రబాబు గతిలేని పరిస్థితుల్లోనే ఆయనకు ఇప్పుడు చీరాల సీటు ఇచ్చారు. కొండయ్య స్థానికంగా ఉంటారనే నమ్మకం తక్కువగా ఉండడం, టీడీపీలో టికెట్ ఆశించిన వారికి భంగ పాటు ఎదురు కావడంతో ఇప్పుడు ఆయన గెలుపుపైనా అంచనా లేవు.
అయితే ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండడంతో ఇప్పుడు రేసు ముక్కోణంగా మారింది. త్రిముఖ పోటీలో ఆమంచి కూడా రేసులోకి వచ్చేశారు. సమీకరణలు ఎలాగైనా మారతాయని ఇక్కడ రాజకీయ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే ఆమంచి ఎడ్జ్లోకి రావడానికి కొన్ని అంశాలు కలిసి వస్తున్నాయి.
ఆమంచికి కలిసి వస్తున్న అంశాలు ఇవీ..
+ స్థానికుడు.. పైగా పిలిస్తే.. పలికే నాయకుడు అన్న భావన.
+ వ్యక్తిగతంగా నియోజకవర్గానికి బలమైన నేతగా గుర్తింపు
+ వైసీపీలో ఐదేళ్లు పనిచేసినా.. బలమైన గళం వినిపించినా.. ఆయనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్న సానుభూతి పవనాలు వీస్తుండడం.
+ క్షేత్రస్థాయిలో బలమైన కేడర్..
+ కాంగ్రెస్లో ఉన్నప్పుడు.. 2009లో విజయం దక్కించుకోవడం.
+ 2014లో ఒంటరిపోరులోనూ గెలుపు గుర్రం ఎక్కడం ..
+ మాస్ నాయకుడిగా ఉన్న బలమైన ఇమేజ్ వంటివి ఆమంచికి ముక్కోణపు పోరులో ప్లస్ అవుతాయన్నది వాస్తవం.