శ్రీకాకుళం : ఈ ఫ్యామిలీ పెదరాయుడు టైపు.. అంతా సర్పంచులే..!?
వంశపారంపర్యంగా గ్రామ పెద్దగా కొనసాగుతుంటారు.. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయతీలోనూ అలాంటి పరిస్థితే ఉంది. దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. ఈ గ్రామంలో అట్టాడ కుటుంబానికి చెందిన వారే ఏళ్ల తరబడి సర్పంచ్గా ఉంటున్నారు. ఒకే కుటుంబంలోని తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు అంతా సర్పంచులగా ఎన్నికయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 1972లో పంచాయతీకి తొలిసారిగా అట్టాడ కృష్ణామూర్తి నాయుడు సమితి అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అంటూ లేకుండానే ఆయన్ను ప్రజలంతా ముక్త కంఠంతో ఎన్నుకున్నారు. 1977లోనూ ప్రజలు ఆయకే పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయన మూడో కుమారుడు అట్టాడ రాంప్రసాద్ 1995-2001 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశారు. 2001లో సర్పంచి పదవిని జనరల్ మహిళలకు కేటాయించారు.
అప్పుడు కూడా అట్టాడ కుటుంబం నుంచే సర్పంచ్ వచ్చారు. కృష్ణమూర్తినాయుడు భార్య అమరావతి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రిజర్వేషన్ జనరల్ అయ్యింది. దీంతో 2006-2011 వరకు కృష్ణమూర్తినాయుడు పెద్ద కుమారుడు అట్టాడ వెంకటరమణ గ్రామ సర్పంచ్గా ఉన్నారు. 2013లో మళ్లీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఈసారి మూడో కుమారుడి భార్య అట్టాడ కల్పన పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లోనూ అట్టాడ కల్పన మరోసారి సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు.