ఏపీలో పేదలకు కట్టించే ఇళ్లు ఎలా ఉంటాయంటే..?
నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్లపట్టాల పంపిణీతోపాటు, గృహనిర్మాణ పథకాన్ని కూడా డిసెంబర్ 25న లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని, అదే రోజు నమూనా ఇళ్ల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అందరికీ ఒకే విధంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. వైఎస్ఆర్ హౌసింగ్ పేరుతో అందరికీ నాణ్యమైన ఇళ్లను అందించాలని నిర్ణయించారు.
ఈ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం, పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు ఇంజినీరింగ్ సిబ్బందికి సెమినార్లో సూచించారు. డిసెంబర్ 25న సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, అన్ని వివరాలను, పనుల పురోగతిని, ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు.