ఫోన్తోనే కరోనా ఉందో.. లేదో చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
ప్రస్తుతం ప్రపంచ మంతటా కరోనా మయం అయిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది కరోనా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు అంటే.. ఈ మహమ్మారి ఎంతలా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా దెబ్బకు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ నుంచి బయటపడేందుకు దేశాదేశాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఇక రోజురోజుల తరబడి లాక్డౌన్ విధించినా.. ఆర్థిక నష్టం తప్ప కరోనా తీవ్రత తగ్గడం లేదు.
ఇప్పటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పరీక్షలు ఎంత ఖరీదైనవో తెలిసిందే. దీంతో కొంత మంది టెస్ట్ చేయించుకోవడానికి జంకుతున్నారు. అయితే త్వరలో ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్లోనే కరోనా ఉందో.. లేదో.. తెలుసుకోవచ్చు. అదెలా..? అనేగా మీ ప్రశ్న. నిజానికి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో సరైన స్పష్టత లేదు. దీంతో పరిశోధకులు శరీరంలో వైరస్ను ఈజీగా గుర్తించి.. బాధితులు వెంటనే చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకొనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ఉటా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ..ఫోన్తోనే కరోనా వైరస్ ఫలితాలను తెలుసుకొనేందుకు ఓ సెన్సార్ పరికరాన్ని తయారు చేశారు.
కరోనా అనుమానితులు తమ లాలాజలాన్ని ఆ సెన్సార్పై పెట్టి స్మార్ట్ఫోన్కు అనుసంధిస్తే చాలు. అందులో ఉండే సున్నితమైన పరికరాలు డీఎన్ఏలోని వ్యత్యసాలను కనిపెడతాయి. ఎందుకంటే.. కరోనా ప్రోటీన్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఫలితంగా సెన్సార్లు వాటిని వెంటనే గుర్తుపెట్టి ఒక్క నిమిషంలోనే రిజల్స్ ఇచ్చేస్తాయి. ఈ సెన్సార్కు సంబంధించిన యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని, సెన్సార్ పరికరాన్ని మొబైల్కు అనుసంధానం చేస్తే చాలు. ఫలితాలను ఈజీగా తెలుసుకోవచ్చు. సింగిల్ స్టాండ్ డీఎన్ఏ సాయంతో ఈ సెన్సార్ పనిచేస్తుంది. అయితే, ఈ సెన్సార్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది.