ఇప్పుడు తవ్వి తీస్తే.. టీడీపీకే ప్లస్ అవుతుందేమో..?
ఏపీ సీఎం జగన్ కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. గత సీఎం చంద్రబాబు హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇది నిజమైతే.. జగన్ తెలిసి తెలిసి.. తప్పటడుగు వేస్తున్నట్టే అనుకోవాలి.. అంటు న్నారు పరిశీలకులు. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్కమిటీ నివేదిక అందజేసింది. సబ్కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది.. అని తాజాగా వార్తలు వచ్చాయి. అయితే, వాస్తవానికి సంక్షేమ పథకాల్లో గిరి గీసినట్టు ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ పథకాలు అమలు జరిగింది లేదు. నిజానికి సంక్షేమం అంటేనే.. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత కరుణానిధి చెప్పినట్టు.. అయినవారికి అంతో ఇంతో పందేరం చేయడమే! అది చంద్రబాబు హయాం అయినా.. ప్రస్తుతం జగన్ జమానా అయినా.. ఈ విషయంలో అంతే! అంతెందుకు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోనూ అయిన వారికి పందేరం బాగానే జరిగిపోవడం లేదా?
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకరకంగా.. వేరే పార్టీల ప్రబుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మరో విధంగా ప్రజా ధనం పందేరం కావడం లేదా? సో.. సంక్షేమం అంటేనే.. సగం మనోళ్లకు.. అనే మీనింగ్ స్పష్టంగా అర్ధమవుతోంది. ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్. పైన చంద్రబాబు అమలు చేసిన పథకాలు మరింత సింపతీతో కూడుకున్నవి. రేపు నిజంగానే వీటిలో అవకతవకలు జరిగాయని.. పేర్కొంటూ.. చంద్రబాబుపై కేసులు నమోదు చేస్తే.. ఆయా వర్గాల వారు హర్ట్ కావడం ఖాయం. అంతేకాదు, జగన్ కక్ష పూరితంగా చంద్రబాబుపై కేసులు పెడుతున్నారనే భావన ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో చంద్రబాబుకు మరింత సింపతీ పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. అత్యంత వేగంగా వ్యతిరేక ఫలితం ఇస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకుంటే బెటర్ అని అంటున్నారు పార్టీలోని సీనియర్లు. ఇలా కక్ష సాధింపు ధోరణి రాజకీయాలు ప్రారంభమైతే.. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా.. ప్రజలు వాటిని పట్టించుకునే అవకాశం కూడా ఉండదని అంటున్నారు. సంక్షేమం అంటే నే.. తమ వారికి ఎంతోకొంత లబ్ధి చేసుకోవడం.. సో.. దీనిలో తప్పు పట్టాల్సిన పనిలేదు. అందరూ ఈ రాష్ట్ర ప్రజలే కదా!?