రూ.999 ప్లాన్.. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా.. జియో అదిరిపోయే ఆఫర్
రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఈ దిగ్గజ టెలికం సంస్థ రిలయన్స్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.999 ప్రీపెయిడ్ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. 84 రోజుల వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు. అంతేగాకుండా.. జియో వినియోగదారులకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి అదనపు లాభాలు రూ.999 ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ఇతర నెట్ వర్క్లకు 3,000 నిమిషాలు ఉచితంగా అందిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 జీబీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్కు పరిమితమవడం గమనార్హం.
చందాదారులు కొత్త ప్లాన్ను మైజియో యాప్ నుండి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ లేదా గూగుల్ పే లేదా పేటిఎం లాంటి యాప్స్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.599, రూ.555 ప్లాన్లు. ఇవి వరుసగా 2జీబీ, 1.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్లాన్ల ద్వారా కూడా జియో నుంచి జియోకు ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు చేసుకోవడానికి 3000 ఉచిత నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభ్యం అవతుండడం గమనార్హం. అలాగే జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది. ఈ ఆఫర్తో జియో వినియోగదారులు ఇక పండుగ చేసుకుంటారని చెప్పొచ్చు.