అమ్మ అమానుషం.. 4 ఏళ్ల కుమారుడిని అతి కిరాతకంగా... ?
సంతానం లేని తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పడానికి కూడా వీలవదు.. ఒక స్త్రీకి తన జీవితంలో నిజమైన ఆనందం అంటే.. తన కడుపులో తొమ్మిది నెలలు పెరిగిన శిశువు బయటకు వచ్చిన క్షణంలో చేతులోకి తీసుకున్నప్పుడు కలిగే ఆ మధుర క్షణాలను ఎప్పటికి మరచిపోదు.. ఇక పిల్లలు పుట్టాక తన ప్రపంచం అంతా వారే.. ఆలనపాలన చూస్తూ అల్లారుముద్దుగా సాకుతుంది.. ఇది తల్లిలో ఉన్న సహజగుణం.. కానీ ఒక తల్లి మాత్రం తన కన్నపేగునే కాటేసింది.. ముద్దులొలికే చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చింది..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ కిరాతకం అమ్మదనానికే మాయని మచ్చలా మిగిలిపోతుంది.. ఇక టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో గత శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.. రితికా రోహత్గి అగర్వాల్ అనే భారత సంతతి మహిళ తన భర్త ఇంట్లో లేని సమయంలో, తన నాలుగేళ్ల కొడుకును గొంతుకోసి చంపేసింది.. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి వారు నివాసముంటున్న భవనం రెండో అంతస్థులో పడేసి ఏం తెలియని దానిలా ఇంట్లోకి వచ్చింది.. అప్పటి వరకు బయటకెళ్లిన రితికా భర్త తిరిగి వచ్చేసరికి ఇంట్లో కనిపించిన రక్తపు మరకలు చూసి షాకయ్యాడు..
అంతే కాకుండా తన భార్య కూడా ఇంటి బయట శరీరంపై గాయాలతో కనిపించగా కీడు శంకించిన అతను వెంటనే సెకండ్ ఫ్లోర్కు పరుగులు తీశాడు. అప్పటికే అక్కడ 4 ఏళ్ల కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి విలపించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారించారు.
అయితే బాలున్ని ఎవరు హతమార్చారన్న కోణంలో విచారించగా ఆ బాలుని తల్లే దారుణంగా చంపేసిందన్న నిజం బయటకు వచ్చింది.. ఇదే గాక తనకు తానుగా గాయపరచుకున్న రితికాను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే పోలీస్ అధికారులు ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కిరాతకంగా ప్రవర్తించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.. ఇక నిజనిజాలు తెలియవలసి ఉంది..