మంత్రి కాదు.. ఎంపీ కాదు... ఎమ్మెల్యే కాదు.. ఈ శీనంటే జగన్కెందుకంత ఇష్టం...!
తాను స్వచ్ఛందంగా ఆచంట సీటు వదులుకుని డెల్టాలో వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజుల మార్గదర్శకత్వంలో పని చేసుకుంటూ వెళ్లారు. అయితే ఎన్నికల తర్వాత అక్కడ మరో నేత వైసీపీలోనే డ్రామాలు ఆడినే నేపథ్యంలో జగన్ ఆయన్ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కవురును పిలిచి మరీ పాలకొల్లు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. కవురు వచ్చిన వెంటనే పాలకొల్లు వైసీపీలో ఎక్కడా లేని జోష్ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ పాలకొల్లు సీటు ఏకంగా 18 వేల ఓట్ల మెజార్టీతో కోల్పోయింది. కవురు ఎంట్రీ ఇవ్వడంతో నియోజకవర్గంలో రాజకీయంగా ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీలోకి భారీగా టీడీపీ నాయకులు వలస వచ్చారు.
ఆ తర్వాత డీసీసీబీ చైర్మన్ పదవిని సైతం జగన్ ఏరికోరి మరీ శ్రీనివాస్కు ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో సహాకార రంగంలో ఎన్నో మార్పులు తీసుకు వస్తోన్న శ్రీనివాస్ను ఇప్పుడు మరో అదృష్టం వరించబోతోంది. కీలకమైన పశ్చిమగోదావరి జిల్లా జడ్పీచైర్మన్ పదవి బీసీలకు కేటాయించారు. ఈ పదవి బీసీలకు కేటాయించిన వెంటనే జగన్ మదిలో మళ్లీ కవురు శ్రీనివాస్ పేరు మెదిలింది. వెంటనే ఈ పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు జగన్ ఇంకెవరికి ఇస్తాం.. కవురు శ్రీను ఉన్నాడుగా.. శ్రీనుకే ఇచ్చేయండి అని ఠక్కున చెప్పడంతో సీనియర్లు సైతం కవురు పడిన కష్టం జగన్ మర్చిపోలేదని... అందుకే కవురు కష్టానికి తగిన ప్రతిపలం దక్కబోతోందని చర్చించుకున్నారట.
ఇక కవురుకు జడ్పీచైర్మన్ పదవి ఇవ్వడం వెనక జగన్ మరో ప్లాన్ కూడా ఉంది. జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గం గతంలో టీడీపీ వైపు ఉండేది. అయితే ఇప్పుడు కవురు ఎంట్రీతో ఈ సామాజిక వర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ వస్తోంది. భవిష్యత్తులో ఈ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా వైసీపీకి పడేలా చేసే ఎత్తుగడ కూడా ఇక్కడ జగన్ వేశారు. ఇక కవురు ఇప్పుడు జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆయన సొంత మండలం వీరవాసరంతో పాటు పాలకొల్లు మండలాన్ని ఎంచుకునే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా ఎలాంటి పదవి లేని స్థాయి నుంచి ఈ రోజు జగన్ దృష్టిలో అత్యంత ఉన్నత స్థాయికి కవురు ఎదగడం వెనక ఆయన పడిన కష్టం..వివాద రహితుడు కావడం... జగన్ను, పార్టీని నమ్ముకోవడం కలిసి వచ్చాయి.