ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ రాజకీయాలపై గురిపెట్టినట్లు సమాచారం. కేసీఆర్కు ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన పల్లా మొదటి నుంచి వరంగల్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నం సాగిస్తున్నారు. కానీ అవకాశం లభించించలేదు. అన్నీసీట్లు భర్తీ కావడంతో పాటు అంతా స్థానికులే కావడంతో అధిష్ఠానం కూడా టికెట్ ఇచ్చే దుస్సాహసం చేయలేదు. అయితే 2021 లేదా 2022లో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుండటంతో అసెంబ్లీ స్థానంపై కర్చీప్ వేయాలని పల్లా యోచిస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే వరంగల్లో ఏ చిన్న కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం చిక్కినా వదులుకోవడం లేదని టీఆర్ ఎస్ వర్గాలు యోచిస్తున్నాయి. పల్లా ఇటీవల రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన విషయం విదితమే. నియామకం తర్వాత ఆయన అనుచరులుగా చెప్పుకునే కొంతమంది మొదటి సన్మాన కార్యక్రమం వరంగల్ లో నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కొన్ని ప్రాంతాలు తూర్పు నియోజకవర్గం నుంచి మరికొన్ని ప్రాంతాలను కలుపుకుని హన్మకొండ కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాలపై పల్లా మొదటి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక హైదరాబాద్ తర్వాత కీలకమైన వరంగల్ రాజకీయ వేదికపై ముఖ్య అనుచరుడు ఒకరు ఉండాలని కేసీఆర్, కేటీఆర్ కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ కోణంలో పల్లాకు అధిష్ఠానం అండదండలు ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తరుచూ పల్లా రాకపోకలు..కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఇక్కడి ఎమ్మెల్యేలు..మంత్రులకు కూడా ఒంకింత నచ్చడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా పల్లాకే కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో అవకాశం దక్కుతుందని గంపెడాశాలు పెట్టుకున్న నేతలకు పల్లా రూపంలో చుక్కెదురు కానుందని టీఆర్ ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: