వామ్మో : మన తెలుగునాట ఐసీస్ ఏజెంటా?
ఓ వైపు ప్రజలంతా సంక్రాంతి పండుగ సంబురాల్లో సంతోషంగా గడుపుతుంటే... మరోవైపు అదే సమయంలో ఏపీలో ఐఎస్ఐఎస్ ఏజెంట్ కదలికలు కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మూలన ఉన్న చిత్తూరు జిల్లాకు...మరో మూలన ఉన్న శ్రీకాకుళం జిల్లాకు లింక్ పెడుతూ ఉగ్రవాదుల ఏజెంట్ తన పనులు చక్కపెట్టుకున్న తీరు సంచలనంగా మారింది. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ను శ్రీకాకుళం జిల్లా నుంచి తమ ఆపరేషన్ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా జిల్లాలోని కంచిలి పోలీసులు పట్టుకున్నారు. ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా దారుణకాండకు పాల్పడుతున్న ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏజెంట్ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా ఒడిశా చేరుకొని అక్కడి నుంచి బంగ్లాదేశ్కు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు తమకు అందిన పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు... శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం టోల్ గేట్ గస్తీ పెట్టారు. అయితే, పోలీసులు వాహనాలను జల్లెడ పడుతుండటాన్ని సదరు ఏజెంట్ అయిన అష్రాఫ్ పసిగట్టాడు. వ్యూహాత్మకంగా ఖాకీల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గమనించారు. కంచిలి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రెండు గంటల పాటు రోడ్డు బ్లాక్ చేసి, పక్కా ప్లాన్తో సోదాలు చేసి లారీలో వచ్చిన అష్రాఫ్తో పాటుగా మరో ముగ్గురిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సయ్యద్... పాక్ అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్గా పోలీసులు భావిస్తున్నారు. ఆయనే ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అష్రాఫ్కు సహకరిస్తున్నట్లు తేల్చారు. సయ్యద్, అష్రాఫ్తో పాటుగా వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో వీరి నుంచి వివరాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రశాంత జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంలో ప్రపంచవ్యాప్తంగా దారుణకాండకు తెగబడే మూఠా మనషులు పట్టుబడటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.