వర్మకు షాక్... సైబర్క్రైమ్ నోటీసులు.. రేపే....
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ట్విస్టులు, వివాదాల పరంపర కొనసాగుతోంది. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫోటో మార్పింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడు వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై విడుదలకు ముందు నుంచి కేఏ పాల్ అభ్యంతరాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. విడుదల అనంతరం సైతం పాల్ పలు విమర్శలు చేశారు. మరోవైపు కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి వర్మ తీరుపై విరుచుకుపడ్డారు. తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్నట్లు ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా వర్మపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్స్లో పోలీసులను కోరారు. ఈ మేరకు జ్యోతి చేసిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వర్మకు నోటీసులు అందించారు. కాగా, వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట సోమవారం ఉదయం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ సినిమాపై . అమెరికా నుంచి స్కైప్ ద్వారా వర్మ మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య గొడవలు రేకెత్తించేలా సినిమా ఉందని, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వర్మ చిత్రాన్ని రూపొందించాడని మండిపడ్డారు. సెన్సార్ బోర్డు ఆదేశాలతో సినిమాలోని కొన్ని సీన్లను కత్తిరించి.. ఆపై చిత్రాన్ని విడుదల చేశారని పాల్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా విషయంలో మాత్రం తుది గెలుపు తమదే అయ్యిందన్నారు. తన పేరును కూడా వాడుకోలేని దుస్థితి రామ్ గోపాల్ వర్మది అని ఎద్దేవా చేశారు. వర్మ ఇప్పటికైనా తనను క్షమాపణ కోరితే మంచిదని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు.