ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు :అంబటి రాంబాబు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాజధానిపై చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు పెద్దగా స్పందించినట్లు కన్పించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీలను రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒక్క మాట మాత్రం కూడా అడగని చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అప్పుడు కన్పించని ప్రతిపక్షాలు ఓడిన తరువాత బాబుకు కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం రాజధానిపై అపోహలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోదన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం తాడేపల్లిలోని ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని పేరు ఎత్తితే బాబు సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటారని, బాబుకు, ఆయన వర్గానికి మాత్రం రాజధాని బాగా సంపద సృష్టించిపెట్టిందన్నారు. చంద్రబాబురాజధాని పేరుతో చేసిన స్కాములు అన్నీఇన్నీ కావన్నారు. ఇవన్నీ తమ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నంలో ఉందన్నారు.
దీంతో బాబుకు, ఆయన బినామీలు తమ దోపిడీ బయటపడుతుందనే భయంతో రాజధాని పర్యటనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారని చెప్పారు . రాజధాని ప్రాంతంలో ప్రజలు చిత్తుచిత్తుగా టీడీపీని ఓడించినా జ్ఞానోదయం కాలేదన్నారు. రాష్ట్రంలో ఇక్కడి ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో మెరుగైన ఆరోగ్యం అందించేందుకు పక్క రాష్ట్రాలకు ఆరోగ్య శ్రీ విస్తరించామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానిని, కేంద్ర మంత్రులను ప్రజాప్రయోజనాల కోసం కలవడానికే ఢిల్లీ వెళ్తున్నారే తప్ప మరే ప్రత్యేక అంశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మతం, కులం, ఉల్లిపాయలు అని పదిరోజుల నుంచి పవన్ అని ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. యన సార్థకనామధేయుడని, పేరులోని రెండో భాగం కల్యాణంకు చాలా న్యాయం చేశాడని వ్యాఖ్యానించారు.బాప్టిస్టు మతం తీసుకున్నానని పేర్కొన్న పవన్ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.