జనసేన కీలక సమావేశం...ఏం చర్చిస్తున్నారో తెలుసా?
సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన కీలక సమావేశం నిర్వహిస్తోంది. గత కొద్దికాలంగా దూకుడు పెంచేందుకు కసరత్తు చేస్తున్న జనసేన పార్టీ తన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నేడు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించారు. వివిధ అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడంతో పాటుగా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై జనసేన పార్టీ తన రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, ఇసుక వారోత్సవాలు చేసినా ఇప్పటికీ ఇసుక పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, అక్రమ తరలింపు అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ పేర్కొంది. రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో పాలకవర్గం నిర్లక్ష్యంగా ఉండటం, జలవనరులను సంరక్షించుకోవడంలో వైఫల్యం, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన చర్చిస్తారని పార్టీ వివరించింది. ఇసుక కార్మికులకు సంఘీభావంగా నిర్వహించిన విశాఖ లాంగ్ మార్చ్ అనంతర పరిస్థితిపై కూడా సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. తెలుగు మాధ్యమ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడంపై, 'మన నుడి, మన నది' కార్యక్రమ నిర్వహణపై చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
కాగా, ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, కనక రాజు సూరి, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, మనుక్రాంత్ రెడ్డి, బి.నాయకర్, డా.పసుపులేటి హరిప్రసాద్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, చిలకం మధుసూదన్ రెడ్డి, బి.శ్రీనివాసయాదవ్. ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్, పొలిట్ బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.