గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ స్థాయిలో సమ్మె జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ ఉద్యమం సమయంలో కేవలం 42 రోజులు మాత్రమే సమ్మె నిర్వహించారు. అయితే, అప్పటి ప్రభుత్వం దిగిరావడంతో సమ్మె విరమించారు. తెలంగాణ వచ్చిన తరువాత, తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం, ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నది.
ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పక్షంలో మిగతా డిమాండ్లపై కార్మికులతో చర్చలు జరిపితే.. ఇప్పటికే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ, ప్రభుత్వం పట్టిన పట్టును వదలడం లేదు. చర్చలు జరిపేది లేదని మొండికేస్తోంది. సమస్యలు పరిష్కారం కాకుంటే, సమ్మె విరమించేది లేదని కార్మికులు అంటున్నారు. ఇద్దరు కూడా పట్టిన పట్టు వదలకపోవడంతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాగా, ఇప్పుడు ఏదోలా చేసి ఈ సమస్య నుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగానే ఎస్మా ప్రయోగించాలని, సమ్మె చట్ట విరుద్ధం అని, లేబర్ కోర్టులో కేసు ఉన్నది కాబట్టి దీనిపై ఉన్నత న్యాయనిపుణుల కమిటీ అవసరం లేదని అంటోంది ప్రభుత్వం. ఇక 5100 రూట్లకు ప్రైవేట్ బస్సులను అనుమతించే విషయంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ఈరోజు దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. సమ్మెకు చర్చలే పరిష్కారం అని హైకోర్టు చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. జీతాలను సైతం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఉద్యోగాలు లేకపోవడంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తోంది.