తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కీలక మలుపులు తిరుగుతున్నాయి. సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించడం సంచలనంగా మారింది. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదన తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చను తెరమీదకు తెచ్చింది. కోర్టు తీర్పు, కేంద్రం వివరణపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉందదన్న ఆయన.. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని చెప్పారు.
ఆర్టీసీ విషయంలో విభజన జరగలేదన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఎలా కేటాయించింది..? మంత్రి పేర్ని నాని సందర్భంగా ప్రశ్నించారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆర్టీసీ విలీనానికి అంగీకరించారని మంత్రి చెప్పారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనని, విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామన్నారు.
కాగా, విచారణ సందర్భంగా సీజే ఆర్ఎస్ చౌహాన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన రెండు నివేదికలు వేరుగా ఉండడంతో మండిపడ్డారు. ఓ ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. తన 15 ఏళ్ల సర్వీసులో ఇంత దారుణంగా తప్పుడు వివరాలు సమర్పించిన ప్రభుత్వ అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారా? ఇన్ని తప్పులు జరుగుతున్నా సీఎం, రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారని సీజే అని ప్రశ్నించారు. తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జి MDని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావటం లేదని సీరియస్ అయ్యారు.