ఇసుకతో అనేక కుటుంబాలు ముడిపడి ఉన్నాయి వారి జీవితాలను రోడ్డు పాలు చేయొద్దంటూ గత కొద్దీ రోజులుగా భవననిర్మాణ కార్మికులు ప్రభుత్వాన్ని వెదుకుతున్నారు. భవననిర్మాణ కార్మికులు చనిపోతున్నా చీమ కుటినట్టు లేని ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇసుక కొరతపై పోరాటాన్ని ఉద్ధృతం చేసారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట... ఆయన నిరాహార దీక్ష చేశారు.
నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి సంతోషంగా ఉన్న ఇసుకాసురులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారన్నారు. ఇసుక కొరతతో కార్మికులు పస్తులుంటున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. కృత్రిమ ఇసుకకొరత సృష్టించి... వైకాపా నేతలే ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.ఇసుక విషయంలో అవినీతి చేశామని.. తమపై వైకాపా ఆరోపణలు చేసిందని... ఇప్పుడు ఇసుక ఎవరు తింటున్నారో ప్రజలకు తెలుసునని లోకేశ్ ఎద్దేవా చేశారు.
కొత్త ఇసుక విధానమంటే నల్లబజారులో అమ్ముకోవడమా అని ప్రశ్నించారు. వరదల వల్ల ఇసుక లేదనడం సాకు మాత్రమేనన్న ఆయన... అలాగైతే మిగతా రాష్ట్రాల్లో ఇసుక సమస్య ఎందుకు లేదో చెప్పమని నిలదీశారు. మన రాష్ట్రంలోని ఇసుక బెంగుళూరు, హైదరాబాద్ లో దొరుకుతుంది కానీ మన రాష్ట్రంలో దొరకదు. ఇది ఈ ప్రభుత్వ తీరు అంటూ మంది పడ్డారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
కొత్త ఇసుక విధానం పేరుతో విపరీతంగా ధరలు పెంచి... బ్లాక్ మార్కెట్లో ఇసుక సరఫరా చేసే స్థాయికి దిగజారారని వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు చేశారు.
ఎప్పుడూ ఈ స్థాయిలో ఇసుక కొరత లేదన్న ఆయన... గుంటూరు జిల్లాలో కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ఇసుక కొరత, కరెంటు కోతలు ఇలా అన్నీ కోతలే తప్ప సంక్షేమం లేదని ఎద్దేవా చేశారు.
.