ఎవరు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో..- అనే డైలాగు గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి ఇలానే వ్యవహరిస్తున్నారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్. సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. వాటిలో గెలుపు గుర్రం ఎక్కేందుకు, ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే, దీనికిగాను ఆయన దాదాపు ఏడాదిన్నర ముందుగానే పాదయాత్ర ప్రారంభించి ప్రజల మధ్యే ఉంటూ.. సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయన తిరుగులేని మెజారిటీతో పాలన సాగిస్తున్నారు.
ఇక, ఇప్పుడు జగన్ ముందున్న ప్రధాన సమరం.. స్తానిక ఎన్నికలు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసింది. కార్పొరేషన్ల నుంచి పంచాయతీల వరకు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మొత్తంగా వైసీపీ దూకుడు పెంచాలని, వైసీపీనే అన్ని పంచాయతీలు, కార్పొరేషన్లలో విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్.
ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘ సమయాన్ని తీసుకుని గట్టి లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ ఎన్నికలు ఏవో ఆషామాషీగా కాకుండా.. పక్కా పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి గ్రామ, వార్డు ల్లోనూ వైసీపీ జెండా ఎగరాలని, టీడీపీ అనేదే కనిపించకుండా పోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ,వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఏర్పాటు చేశారు.
వీరిని నిత్యం ప్రజల మధ్య ఉంచుతున్నారు. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధిలా వీరు పనిచేసేందు కు ప్రయత్నిస్తున్నారు. తద్వారా రాజకీయంగా గ్రామాలు, వార్డుల్లోనూ వైసీపీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయం ఖాయమని జగన్ తలపోస్తున్నారు. ఈ దెబ్బ టీడీపీకి ఘాటుగా తగలడంతోపాటు కోలుకోవడం కూడా కష్టమేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.