2014 కు ముందు మోడీ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా దేశాలకు సంబంధించి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి మాత్రమే. 2014 లో భారత ప్రధాని. బీజేపీలో ఉద్దండులైన నాయకులు ఎందరో ఉన్నారు. మోడీకంటే సీనియర్లు ఉన్నారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఉన్నారు. వాజ్ పాయి ప్రభుత్వం అధికారంలో ఉండగా అయన కేబినెట్ లో పనిచేసిన ఎందరో నేతలు ఉండగా వారందరిని కాదని, మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో.. దేశరాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
అనుకున్నట్టుగానే మోడీ 2014లో అఖండమైన మెజారిటీతో బీజేపీని గెలిపించారు. ఈ గెలుపుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. మోడీ మొదటి ప్రభుత్వం అధికారంలో ఉండగా పెద్దనోట్లను రద్దు చేశారు. దీంతో దేశంలో అలజడి మొదలైంది. వ్యాపారాలు పడిపోయాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. దీంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయింది.
కానీ, మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. జాతీయభద్రతా, సుస్థిరమైన పాలన దిశగా దేశాన్ని నడిపించాడు. దీంతో దేశం పరుగులు తీయడం మొదలు పెట్టింది. మోడీ 2పాయింట్ 0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్లో అమలులో ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో విలీనం అయ్యింది. ఇప్పుడు పీవోకే పై కన్నేసింది. దేశంలో అంతర్భాగంగా ఉన్న పీవోకేను తిరిగి ఇండియాలో కలుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా, పాకిస్తాన్ లోని సింధ్ ప్రజలు తమ గోడు వినాలని మోడీకి ప్రాధేయపడుతున్నారు. పాకిస్తాన్ లోని సింధ్ లో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమ గోడును ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించాలని వారు కోరుతున్నారు. సింథ్, బలూచిస్తాన్, ఆఫ్గనిస్తాన్ ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా ఉంటున్నాయి. అక్కడి మైనారిటీలు ఇబ్బందులు పడుతున్నారు. మరి మోడీ ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారా చూడాలి.