బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికి తెలిసిందే. కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. భూమి ఎలా అంతం అవుతుంది. ఎలాంటి వ్యక్తులు భూమిపై ఉన్నారు. ఎవరి వలన భూమి అంతం అవుతుంది అనే విషయాల గురించి ప్రస్తావించారు. అయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. భూమిపై అతి వృష్టి, అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని, అతి వృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని అన్నారు.
అయన చెప్పినట్టుగానే దేశంలో ప్రస్తుతం వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా తుంగభద్రా నది ఉప్పొంగి పొంగుతున్నది. వరద భీభత్సానికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కర్నూలు నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తుంగభద్రా నీరు కర్నూలులోకి వచ్చింది.
ఎగువనుంచి ఇంకా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. దీంతో తుంగభద్రా నది ఉగ్రరూపం మరింతగా దాల్చే అవకాశం ఉన్నది. దీంతో కర్నూలు ప్రజలను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. వీలైనంత త్వరగా నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేయాలనీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్రా మరింత ఉగ్రరూపం దాలిస్తే కర్నూలు మొత్తం నీట మునుగుతుంది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి కదిలేందుకు అంగీకరించడం లేదు. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కాబట్టి తుంగభద్రకు వరద నీరు మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2009 లో వచ్చిన వరదలకు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా నష్టం జరిగింది. మరలా అలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.