సంచలన పరిణామాలు, అనేక ట్విస్టులతో సాగిన కర్ణాటక రాజకీయానికి శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గురించి పలువురు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
తెలంగాణలోని ఓవైసీకి..కర్ణాటకలోనికుమారస్వామికి లింకేంటి అంటారా...వివరాల్లోకి వెళితే...అసలు సంగతి తెలుస్తుంది. గత ఏడాది అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ``కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ నాయకుడు అయిన కుమారస్వామి ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి సీఎం అవగా లేనిది.. తెలంగాణలో ఎంఐఎం ఎందుకు ఆ స్థానాన్ని ఆశించకూడదు? మనం ఎందుకు సీఎం కుర్చీపై కూర్చోలేం?`` అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అక్బర్ చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే, అనంతరం ఈ వివాదాన్ని చక్కదిద్దేందుకు అసదుద్దీన్ ప్రయత్నించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన సోదరుడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరని అన్నారు.
ఇదిలాఉంటే...సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన కుమారస్వామి తమ భాగస్వామ్య ఎమ్మెల్యేల సహాయ నిరాకరణతోనే...సీఎం కుర్చీని కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేల మద్దతు పొందలేక పతనమైంది. ఈ ఎపిసోడ్కు ముందుకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవడాన్ని తప్పించుకునేందకు వీలైనన్ని రూపాల్లో కుమారస్వామి ప్రయత్నించారు. సంకీర్ణ తలనొప్పులు ఎలా ఉంటాయో....తాను ప్రస్తావించిన కుమారస్వామి ఉదంతంతో ఓవైసీ గ్రహించారా అంటూ పలువురు ప్రస్తావిస్తున్నారు.