చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వంగవీటి రాధా వైసీపీలో ఉండి ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి అధికారాన్ని అనుభవించేవాడు. కానీ రాధా తన చేసుకున్న స్వయంకృపరాధమని చెప్పాలి. జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వెళ్ళబోతున్నారట. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ఇప్పటికే రాధ, ప్రాథమికంగా మంతనాలు జరిపేశారు. రేపో మాపో ఆ పార్టీలోకి వెళ్ళడం ఖాయమే. వంగవీటి రాధ.. అంటే, ఆయన జనానికి చేసిన సేవ ఎవరికీ గుర్తుకు రాదు.. వివాదాలే గుర్తుకొస్తాయి. తండ్రి పేరు చెప్పుకుని పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప ఆయన రాజకీయాల్లో ఉద్ధరించేసిందేమీ లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల గౌరవ మర్యాదలూ పొంది, చివరి నిమషంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వంగవీటి రాధ. అదీ ఒకందుకు మంచిదే అయ్యిందేమో.! లేకపోతే, అధికార పార్టీ నేతగా వంగవీటి రాధ ఇప్పుడు ఓ రేంజ్లో అనవసర హంగామా చేసి వుండేవారేమో. 'ప్చ్.. ఆ అదృష్టం ఆయనకు లేకుండా పోయింది..' అని బాధపడేవారు ఇప్పుడెవరూ లేరు సరికదా.. 'ఆయనకి తగిన శాస్తే జరిగింది' అనుకునేవారే ఎక్కువ.
జనసేనలోకి వంగవీటి రాధని పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎందుకంటే, వంగవీటి రాధతో పవన్ కళ్యాణ్కి 'పరిచయం' ఈనాటిది కాదు. ప్రజారాజ్యం పార్టీ టైటమ్లో పవన్ కళ్యాణ్కి రైట్ హ్యాండ్లా కన్పించారు అప్పట్లో వంగవీటి రాధ. 'కాపు సామాజిక వర్గం' ఓటు బ్యాంకు కోసం తప్ప, వంగవీటి రాధని ఎవరూ తమ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదన్నది ఓపెన్ సీక్రెట్. అలా ఆ ఓటు బ్యాంకు కోసమే, తాజా ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలివిగా, వంగవీటిని తనవైపుకు లాక్కున్నారుగానీ.. చంద్రబాబు ఆశించిన ఫలితం దక్కలేదు.