చంద్రబాబు వచ్చే లోపు టీడీపీ సగం ఖాళీ ..?
చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడంతో టీడీపీ రాజ్య సభ ఎంపీలు అదును చూసి దెబ్బ కొట్టారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరిపోయినట్టుగా ప్రకటించుకున్నారు. వారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కూడా కలిసి తమ లేఖను ఇచ్చారు. తమకు తెలుగుదేశం పార్టీతో ఇక సంబంధం లేదన్నట్టుగా వారు ప్రకటించారు. బీజేపీ నేతలు దగ్గరుండి వారిని వెంకయ్య నాయుడు వద్దకు తీసుకెళ్లారు. ఇలా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే పనిలో భారతీయ జనతా పార్టీ వాళ్లు బిజీగానే ఉన్నారు.
తలా ఒక బాధ్యతను తీసుకున్నట్టుగా ఉన్నారు.అందులో భాగంగా ఏపీ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మరిన్ని వలసలు ఉండబోతున్నాయని ప్రకటించారు. తెలుగుదేశం నుంచి మరింత మంది నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి రెడీ గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వారందరూ అతి త్వరలోనే కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన ప్రకటించారు.
అంతే కాదు.. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన పై కూడా విష్ణు వర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని వచ్చే సరికే ఏపీలో తెలుగుదేశం పార్టీ పని పూర్తి అవుతుందని విష్ణు చెప్పుకురావడం విశేషం. చంద్రబాబు నాయుడు ఏమీ సుదీర్ఘ పర్యటనకు వెళ్లలేదు. అయినా అంతలోపే ఫిరాయింపులు పూర్తి అవుతాయన్నట్టుగా ఈయన మాట్లాడటం గమనార్హం. మొత్తానికి కమలం పార్టీ నేతలు చాలా దూకుడుగానే ఉన్నట్టున్నారు!