కోడికత్తి.. కోడికత్తి కేసు.. కోడికత్తి పార్టీ.. కొడికత్తి లీడర్లు..ఇదీ ఎన్నికల ముందు టీడీపీ నాయకులు.. వైసీపీ పై చేసిన మాటల దాడి.. కనీసం వైసీపీ పేరు కూడా పెట్టకుండా కోడికత్తి పార్టీ అనే పిలిచేవారు కొందరు నాయకులు.. దీనికి ప్రధాన కారణం. విశాఖ ఎయిర్ పోర్ట్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యా యత్నం.
ఈ హత్యాయత్నం ఘటన జరిగినప్పుడు సీఎంగా వున్న చంద్రబాబు.. అలాంటి ఘటనల్ని తీవ్రంగా ఖండించి ఉండాల్సింది. జగన్ను ఫోనులోనైనా పరామర్శించాల్సింది. కానీ చంద్రబాబులో అంతటి ఔన్నత్యం కనిపించలేదు. ఈ ఘటనపై బాబు, డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇక ఎన్నికల ప్రచారం సంగతి సరే సరి.. చంద్రబాబు వైకాపాను ‘కోడికత్తి’ పార్టీగా అవమానించారు. అంతేనా.. చంద్రబాబు అహంభావం ఆ తర్వాత కొత్త పుంతలు తొక్కింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ, ఇంటెలిజన్స్ ఐ.జి. వెంకటేశ్వరరావు తొలగింపు వ్యవహారంలోనూ చంద్రబాబు బాగా రెచ్చిపోయారు.
సిబిఐ పైన, ఎన్ఐఎ పైన, ఇన్కంట్యాక్స్ దాడుల పైన, ఎలక్షన్ కమిషన్ పైన, నూతన చీఫ్ సెక్రటరీపైన బాబు చేసిన యుద్ధం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాము ఏది చేసినా ఆహా అని రాసే పత్రికలు ఉన్నాయన్న భరోసాతో ఎంతకు తెగించాలో అంతా చేశారు. కానీ ఓట్లేది జనం మీడియా అధినేతలు కాదు.. అన్న సంగతి మరిచారు. అలా ఆ కోడికత్తే చివరకు టీడీపీని కాటేసింది.