తెలంగాణా మేమే ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రతి సీటు ప్రధానంగా మారింది. ఏ ఒక్కటి మిస్సయినా అధికారం కష్టమనే భావనతో ఉండడం ఒక ఎత్తయితే.. అధికార టీఆర్ ఎస్ను ఎట్టి పరిస్థితిలోనూ మట్టి కరిపించాలనే లక్ష్యం మరోవైపు. ఈ నేపథ్యంలో ప్రతి స్థానాన్నీ ప్రాణ సమానంగా భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలోనే టికెట్లు ఇవ్వడం మొదలుకుని, ప్రచారం వరకు కూడా ఎన్నో జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నారు. అయితే, ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్తితి ఎలా ఉన్నాకూడా హుజారాబాద్ విషయం మాత్రం కాంగ్రెస్ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు గుర్రం ఎక్కలేదు. ఎవరు పోటీ చేసినా పరాజయం పాలవుతూనే ఉన్నారు.
మరి ఇప్పుడు ఇలాంటి చోట విజయం సాధించి, కేసీఆర్కు గట్టిగా బుద్ది చెప్పాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు రాజకీయ పక్షాల చూపు మొత్తం హుజూరాబాద్పైనే పడింది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా? చరిత్ర సృష్టిస్తుందా? అనేది చర్చల ప్రధాన సారాంశం. మరి ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.. పదండి!.. హుజూరాబాద్ నుంచి తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా ఆరో సారి ఎన్నికల బరిలో నిలుస్తుండగా కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘు కూడా మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. 1994లో టీడీపీ నుంచి ఇక్కడ గెలుపొందిన ఇనుగాల పెద్దిరెడ్డి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 1999లో కూడా తిరిగి మంత్రిగా పని చేశారు. 2004లో విజయం సాధించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రి పదవిలో కొనసాగారు.
2009లో ఈటల రాజేందర్ మొదటిసారిగా పోటీ చేసి గెలుపొందారు. 2010లో ఉప ఎన్నికల్లో మరోసారి ఈటల గెలుపొం దారు. 2014లో గెలుపొంది రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ 60రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి కుల సంఘం ఆశీర్వాద సభలు నిర్వహించి మంత్రి ఈటలకు మద్దతు పలికింది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, తనకే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్రెడ్డి గత సంవత్సరం నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు సాధిస్తూ గ్రామగ్రామాన కేడర్ను తయారు చేసుకున్నారు.
రాజకీయాలకు కొత్త అయినా కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి కేడర్ను కూడకట్టడంలో విజయవంతమయ్యారు. ఒక్క సారి అవకాశం ఇవ్వాలని ప్రచారంలో ఓటర్లను కోరుతున్నారు. 40 ఏళ్లుగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలువలేదు. ఇచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వకుండా కొత్తవారికి ఇవ్వడంతో ఓటమి పాలవుతుంది. ఇప్పుడు కూడా కొత్తవారికే అవకాశం ఇచ్చారు. మరి ఈయన గెలుస్తాడా? అనేది ప్రధాన ప్రశ్న. నిజానికి ఈటెల చాలా సీనియర్. ఆయనను ఢీకొట్టడం సాధ్యమయ్యే పనికాదని టీఆర్ ఎస్ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. మరి దీనిని బట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అంత ఈజీ అయ్యే పనికాదు. మరి సీనియర్లు ఏమైనా కృషి చేస్తే.. తప్ప.. తాజా అభ్యర్థి విజయం సాధ్యం కాదనేని నిష్టుర సత్యం మరి ఏం జరుగుతుందో చూడాలి