తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నాయకులపై ఉన్న పాత కేసులన్నీ తెరమీదకు వస్తున్నాయి. జనం మరిచిపోయిన కేసులన్నీ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే.. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులే ఉండడం గమనార్హం. తాజాగా.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నాయా..? లేక విచారణలో భాగంగానే కొనసాగుతున్నాయా..? అన్న కోణంలో ఒక్కటే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన చంద్రబాబుతోపాటు పలువురిపై నమోదు అయిన కేసు మళ్లీ ఇన్నాళ్లకు తెరమీదకు రావడంలో రాజకీయ కోణం దాగి ఉందనే టాక్ వినిపిస్తోంది.
2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అక్కడి పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే.. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్కోర్టులో పిటిషన్ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా రాజకీయ కోణంలో నడుస్తుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికరమై టాక్ కూడా వినిపిస్తోంది.
అదును చూసి ప్రత్యర్థిని దెబ్బకొట్టడంలో కేసీఆర్ దిట్ట. ఈ విషయంలో అనేక సార్లు రజువు అవుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ కొంత హడావుడి చేస్తోంది. నిజానికి.. కాంగ్రెస్ తర్వాత టీటీడీపీనే కొంత బలంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ పట్టుగురించి ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. ఈనెల 8న చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమై.. దిశానిర్దేశం చేశారు. పార్టీకి అన్నివనరులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. ఇక అదే సమయంలో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. దీని నుంచి చంద్రబాబు తప్పించేందుకే.. కేసీఆర్ పక్కా ప్లాన్ వేశారనే టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడం గమనార్హం. ఇటీవల మోడీతో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు అడుగుపెట్టకుండా చేసేందుకు.. ఇక్కడ నాయకత్వానికి వనరులు సమకూర్చకుండా ఉండేందుకు మోడీతో కలిసి కేసీఆర్ ఇదంతా నడిపిస్తున్నారనే వాదన కూడా మొదలైంది. నిజానికి.. ఇన్నేళ్ల తర్వాత.. అదికూడా ఎన్నికల ముంగిటనే ఇలా కేసు మళ్లీ తెరమీదకు రావడంతో సహజంగానే రాజకీయ కోణం కనబడుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇక ఓటుకు నోటు కేసు కూడా మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో.. ఎవరికి కలిసి వస్తాయో చూడాలి మరి.