2019 ఎన్నికల్లోపు ఏ పార్టీతోనూ పొత్తులుండవని వైసిపి అధ్యక్షుడు వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదని జగన్ తేల్చేశారు. ప్రత్యేకహోదాకు మద్దతిచ్చే పార్టీకే తమ మద్దతంటూ గతంలో చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పారు. జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిజెపితోనో లేకపోతే జనసేనతోనో పొత్తుంటుందని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే. ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా, వైఎస్ఆర్ పాలన పునరుధ్ధరణ, చంద్రబాబునాయుడు పాలనను తరిమికొట్టట ప్రధాన అజెండాగా జగన్ స్పష్టంగా చెప్పారు.
చంద్రబాబువి అబద్దపు ప్రచారాలే
పోయిన ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు హామీలు, అబద్దపు ప్రచారాన్ని నమ్మిన జనాలు చంద్రబాబును ఎన్నుకున్నట్లు మండిపడ్డారు. తన అబద్దపు హామీలకు నరేంద్రమోడి హవా, పవన్ కల్యాణ్ కూడా ఊతంగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికల కోసం తాము ప్రత్యేకంగా సిద్దమయ్యేదేమీ లేదన్నారు. నిరంతరం తమ నేతలు జనాల్లోనే ఉన్నందు వల్ల ఎన్నికలను ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధమే అన్నారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలు రావటమన్నది వైసిపికి, రాష్ట్రానికి చాలా మంచిదని అభిప్రాయపడ్డారు.
ఎన్ని పార్టీలున్నా తమకు నష్టం లేదు
వచ్చేఎన్నికల్లో బహుముఖ పోటీ తమ పార్టీ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బిజెపి. జనసేన మద్దతుదారులందరూ పోయిన ఎన్నికల్లో టిడిపికే ఓట్లు వేసిన సంగతిని జగన్ గుర్తు చేశారు. అప్పట్లో అందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి పై పార్టీల మద్దతుదారులు టిడిపికి ఓట్లేశారన్నారు. ఇపుడు మూడు పార్టీలూ విడిపోయాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేనలు టిడిపికి పడ్డ ఓట్లనే చీల్చుకుంటాయే కానీ వైసిపికి ఎటువంటి నష్టం జరగదని జగన్ అభిప్రాయపడుతున్నారు.
జనసేన మద్దతు ప్రతిపాదన రాలేదు
జనసేన గురించి మాట్లాడుతూ, తమకు మద్దతిచ్చే విషయమై తన వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ఒకరితో పొత్తు పెట్టుకోవటమో లేకపోతే మద్దతు తీసుకోవాల్సిన అవసరమో తమ పార్టీకి లేదన్నారు. అసలు పొత్తుల గురించి ఆలోచించే స్ధితిలో తాము లేదని కూడా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జాతీయ స్ధాయిలో ఏదైనా ఫ్రంటులో గానీ లేకపోతే మిత్రపక్షాల కూటమిలో కానీ చేరాలన్న ఆలోచన, ఆశక్తి తనకు లేదన్నారు. అసలు, జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న కోరిక కూడా తనకు లేదని జగన్ తేల్చేశారు.