ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల జనాల్లో నానుతోంది. గత మూడున్నరేళ్లలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపాయి. ఏపీలో విపక్ష వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలు దక్కించుకుంటే, ఇప్పుడు ఆ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో ఈ కౌంట్ 88 కు చేరుకుంది. తెలంగాణలోనూ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి - మల్లారెడ్డి- పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కారెక్కేశారు.
ఇక ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ మన తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రమైన కర్నాకటకు కూడా పాకేసింది. కర్నాటకలో వచ్చే సమ్మర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక దక్షిణాదిలో బీజేపీ ఒక్క కర్నాటకలో మాత్రమే గతంలో అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు అక్కడ మరోసారి పాగా వేయాలని ట్రై చేస్తోంది.
ఇటీవల సౌత్లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతో బీజేపీ ఉంది. ఇదిలా ఉంటే బీజేపీకి కర్నాటకలో గెలవడం అంత వీజీగా లేదు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్న లుకలుకలను క్యాష్ చేసుకుంటోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మధ్య కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఒకప్పుడు బీజేపీకి కంచుకోట. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకు గానూ 5 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.
ఇక్కడ మౌనింగ్ కుంభకోణమే బీజేపీని ఓడించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఇక్కడ మళ్లీ బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఈ సారి అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరైన బీ నాగేంద్ర ఈ నెల 27న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆదివాసీ కమ్యూనిటీ నేత అయిన నాగేంద్ర, పార్టీ మారుతుండటం బీజేపీకి భారీ దెబ్బనే. మరోవైపు హోసాపేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీకి కంచుకోటగా ఉన్న బళ్లారిలో మళ్లీ ఆ పార్టీ జెండా ఎగరాలంటే ఇక్కడ గట్టి పట్టు ఉన్న మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, జనాకర్షణ ఉన్న గాలి జనార్దన్ను పార్టీలోకి తీసుకోవటమే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందా ? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మరి గాలి విషయంలో బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో ? చూడాలి.