2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలకు మరింత పదును పెంచుతున్నారు. టీడీపీ కంచుకోటలను నిలుపుకుంటూనే వైసీపీకి బలమైన నియోజకవర్గాలను కైవసం చేసుకునేలా ఆయన వ్యూహప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీయే మెజార్టీ సీట్లు సాధించింది. ఇంకా చెప్పాలంటే గత మూడు ఎన్నికల్లోను ఇక్కడ టీడీపీ వెనకపడిపోతోంది.
వచ్చే ఎన్నికల్లో మాత్రం చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ జెండా ఎగరాలని ప్లాన్ చేస్తోన్న చంద్రబాబు అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు. నగరి నుంచి వైసీపీ ఫైర్బ్రాండ్ రోజాను ఓడించేందుకు ప్రముఖ సినీ నటి వాణీ విశ్వనాథ్ లేదా మరోపేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇక గత నాలుగు ఎన్నికల్లోను టీడీపీ జెండా ఎగరని చంద్రగిరిలో కూడా వైసీపీని ఓడిచేందుకు ఏం చేయాలా ? అనే దానిపై బాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు.
ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉండేందుకు కారణంగా కనిపిస్తోన్న తండ్రీ కొడుకులు రాజంపేట ఎమ్మెల్యే మిథున్ రెడ్డి, ఆయన తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలకు కూడా చెక్ పెట్టడం ద్వారా వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన తనయుడు మిథున్రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజంపేట ఎంపీ సెగ్మెంట్ కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ తండ్రి కొడుకులను టార్గెట్ చేసేందుకు చంద్రబాబు తండ్రికొడుకుల అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు.
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సోదరుడు కిషోర్కుమార్ రెడ్డి, ఆయన తనయుడు అమర్నాథ్రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఇద్దరికీ చెరో టిక్కెట్ ఇచ్చేందుకు కూడా బాబు రెడీ అయ్యారని తెలిసింది. వీరిలో కిషోర్కుమార్రెడ్డికి పీలేరు అసెంబ్లీ సీటు, ఆయన తనయుడికి రాజంపేట ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ తండ్రి కొడుకులను పార్టీలోకి తీసుకువచ్చి జిల్లాలోని రాజంపేట ఎంపీ సెగ్మెంట్ విస్తరించి ఉన్న నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టే క్రమంలోనే బాబు నల్లారి ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది.