ఈ మద్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. ఇప్పటికే అధికార పక్షం, ప్రతిపక్షానికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరోవైను కెబినెట్ విస్తరణ తర్వాత స్వపక్షం నుంచి చంద్రబాబుకి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ నేత కొలుసు పార్థసారధి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.
ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవినేని ఉమా పిచ్చికుక్క అని, ఉన్మాదిలా మాట్లాడుతున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు.దేవినేని ఉమా మాటలు పిచ్చికుక్క మొరిగినట్లున్నాయని ఆయన విమర్శించారు. తన సొంతజిల్లాకూ దేవినేని ఉమా నీళ్లివ్వలేదని ఆరోపించారు. నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారని ఆయన తెలిపారు. ప్రతిపక్షంగా నిలదీస్తే తమపైనే బురద జల్లుతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
దళితురాలు అయినందునే పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగించారని, అదే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేనిని మాత్రం కేబినెట్ నుంచి తొలగించలేకపోయారన్నారు. ఉమ చేతగాని దద్దమ్మ, బ్రోకరిజంలో నెంబర్ వన్... అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. పెరిగిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఎవరు భరిస్తారని, రాష్ట్రం భరిస్తుందా, లేక కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా అనేది చెప్పాలని, ఏపీపై ఒక్క రూపాయి భారం పడినా ఎవరూ క్షమించరన్నారు. పిచ్చివాగుడు మాని తమ ప్రశ్నలకు సమధానం చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు.