ఢిల్లీ : ఈడీతో కవిత ఢీ..ఓవరాక్షనేనా ? ఈడీ కీలక నిర్ణయం ?

Vijaya



కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి మధ్య వ్యవహారం టామ్ అండ్ జెర్రీ షోలాగ తయారైంది. కవితను విచారణకు పిలిపించాలని ఈడీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఈడీ విచారణనుండి తప్పించుకోవాలని కవిత కూడా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకనే తమదే పైచేయి కావాలంటే కాదు తమదే పైచేయిగా నిరూపించుకోవాలని ఇద్దరు ఎవరిస్ధాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ ప్రయత్నాలే టామ్ జెర్రీ షో లాగ అనిపిస్తోంది.



విషయం ఏమిటంటే మొన్న 11వ తేదీన విచారణకు హాజరైన కవిత గురువారం విచారణను ఎగ్గొట్టారు. విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వమని సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే దాన్ని 24వ తేదీన విచారించాలని కోర్టు డిసైడ్ అయ్యింది. దాంతో కోర్టులో విచారణ పూర్తయ్యేవరకు తాను విచారణకు హాజరుకానని చిన్నపిల్లలు అల్లరిచేసినట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు కాబట్టి 20వ తేదీన హాజరుకావాల్సిందే అని ఈడీ కవితకు మళ్ళీ నోటీసులిచ్చింది.



కవితేమో సీఆర్పీసీ యాక్ట్ 160 ప్రకారం మహిళలకున్న హక్కులను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. సీఆర్సీసీ రెగ్యులర్ యాక్ట్ 160 ప్రకారం 15 ఏళ్ళు వయసులోపున్న పిల్లలు, వృద్ధ మహిళు, అనారోగ్యంతో ఉన్న వారిని ఈడీ వాళ్ళింటికే వెళ్ళి వచారించాలి. దీన్నే కవిత పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే కవితకు నోటీసులిచ్చింది సీఆర్పీసీ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వలేదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద నోటీసులిచ్చారు.



పై చట్టం కింద నోటీసులు అందుకున్న వాళ్ళ కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందే లేకపోతే కోర్టుకు వెళ్ళటం తప్ప వేరే మార్గంలేదు. అయితే కవిత పిటీషన్ను 24వ తేదీన విచారించబోతున్నట్లు కోర్టు ఇంతకుముందే చెప్పేసింది. అంటే కవిత పిటీషన్ పై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కాబట్టే కవిత విచారణకు హాజరవ్వాల్సిందే అని ఈడీ పట్టుబట్టింది. మరి 20వ తేదీన విచారణకు కవిత హాజరుకాకపోతే అరెస్టు చేసి విచారించేందుకు అనుమతించాలని కోర్టులో పిటీషన్ వేసే అవకాశాలున్నాయి. మరి ఈడీ ఏమిచేస్తుందో ? కోర్టేమంటుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: