శ్రీకాకుళం వార్త : ధర్మాన దూతలతో జాగ్రత్త! బహు పరాక్!
ఆ రోజు జగన్ పార్టీ ఎనౌన్స్ చేయగానే ఆయన సోదరుడు కృష్ణదాసు ముందుగా చేరారు. ఆ తరువాత చాలా రోజులకు చాలా తర్జన భర్జనల తరువాత మిగతా నాయకుల ఒత్తిడి కారణంగా ధర్మాన ప్రసాదరావు వైసీపీ కండువా కప్పుకుని జగన్ అనుచరుడిగా మారిపోయారు. ఇప్పటికీ ప్రయివేటు సంభాషణల్లో ఈ ప్రభుత్వానికో విజన్ లేనేలేదని, తనకు మంత్రి పదవి ఇచ్చినా వద్దనే అంటానని, నేను పోయి ఫైల్ ఇచ్చి దానిని ఆమోదింపజేసుకునేందుకు నానా పాట్లూ పడలేనని అంటుంటారు ఆయన. ఆర్థిక లావాదేవీల విషయమై ఖచ్చితంగా ధర్మాన గత కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయారు. లాక్డౌన్ సమయంలో కూడా పెద్దగా బయటకు రాలేదు.
ఒక్కటంటే ఒక్క సేవా కార్యక్రమం చేయలేదు. కొందరు అనుచరులు మాత్రం పెదపాడు నేషనల్ హైవేపై మజ్జిగ ప్యాకెట్లు వలస కూలీలకు అందించి అదే పెద్ద ఘన కార్యం అన్న విధంగా బిల్డప్పులు మాత్రం ఇచ్చారు. ఇదే కోవలో మీడియా కూడా ధర్మాన కు హైప్ ఇవ్వడం కానీ ఆయన గురించి రాయడం కానీ మానుకుంది. గతంలో ఆ యన సాయం పొందిన కొన్ని లోకల్ మీడియాలు మాత్రం ఇప్పటికీ ధర్మాన భజన చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ రోజు కన్నెధార కొండ లీజుకు సంబంధించి పోరాటాలు చేసిన ఈనాడు ఇవాళ మాట్లాడడం మానుకుంది. అదేవిధంగా వైసీపీ హయాంలో ఉన్న తప్పిదాలు, శ్రీకాకుళం కేంద్రంగా జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ రాస్తే బాగుంటుంది కానీ రాయడం మాత్రం ఈనాడు మానుకుంది. కొందరు స్టాఫ్ రిపోర్టర్లు కన్నెధార ఇష్యూ తరువాత మారినా వాళ్ళంతా ధర్మానకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా కొందరు ఈనాడు విలేకరులు అందరి దగ్గరా మంచి మన్నన పొందేందుకు చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. ఇదీ ఓ ఆరోపణ. బాధ్యతతో పనిచేయాల్సిన మీడియా ఇలా ఉంది. ఇక లోకల్ మీడియా అంటే ధర్మానకు ఎప్పుడో అమ్ముడుపోయింది.ఇక పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ సాధించేదేముందని?
ఈ నేపథ్యంలో ధర్మాన తన తరువాత రాజకీయం అంతా నగర పరిధి వరకూ చల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి చూసుకుంటారని ప్రకటించారు. వరుసకు ఆయన ఈయనకు తమ్ముడు. మొన్ననే విశాఖ గ్రామీణ బ్యాంకు ఉద్యోగిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి (ధర్మాన ఆదేశాల మేరకు) విశాఖ బీ కాలనీ కేంద్రంగా పెద్దాయన ఆజ్ఞ మేరకు రాజకీయం నడుపుతున్నారు. దీంతో ఈయన పెత్తనాన్ని నగర వైసీపీ ఒప్పుకోవడం లేదు. ఎక్కడికక్కడ ఆయనను నిలువరించేందుకు డివిజన్ ఇంఛార్జులు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగర పార్టీ వ్యవహారాలు అన్నీ ఛిన్నా భిన్నం అయి ఉన్నాయి. త్వరలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్న ధర్మానకు ఇవన్నీ ఆశా భంగాలే! ఆయన తరఫు రాజకీయం నడపడంలో సమాంతర ప్రభుత్వాన్ని నడపడంలో చల్లా శ్రీను పేరు ప్రముఖంగా వినవస్తున్నా, ఆయన అనుకున్నవన్నీ సఫలీకృతం కావడం జరగని పని! ఇదే సమయంలో శ్రీకాకుళం కమిషనర్ చల్లా ఓబులేశు ప్రతిరోజూ చల్లా శ్రీను ఇంటికి వచ్చి
కొన్ని పనులు చక్కబెట్టి వెళ్తున్నారు. ఇటీవల వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీలో కూడా కమిషనర్ కు చల్లా శ్రీను చెప్పిన మాటే వేదవాక్కు అయిందన్నది ఓ ఆరోపణ.
- రత్నకిశోర్ శంభుమహంతి