సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్ పర్ఫార్మెన్స్లు, సరదా స్కిట్లు హైలైట్గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటి`దర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, బాబూమోహన్, సునీల్, వెన్నెల కిశోర్, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్, కార్తికేయ, రాంకీ, విష్వక్సేన్, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్బాబు, అల్లు అరవింద్, అంబికా కృష్ణ, దిల్ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్, తమిళ వెటరన్ యాక్ట్రెస్ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్కుమార్, సంగీత దర్శకుడు తమన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు.
‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును శ్రియ, జయం రవి చేతుల మీదుగా హీరో కార్తికేయ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇది నా ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు. ఒక అవార్డు ఫంక్షన్కు రావడం ఇదే తొలిసారి. నేను తెలుగులో జయం రవిగారిలా ఉండాలని అనుకుంటున్నా. ఈ అవార్డు తీసుకునేంత అర్హత ఉందో లేదో నాకు తెలీదు. ఈ అవార్డును శ్రియ, జయం రవిగారి చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నాకు మంచి బ్రేక్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.