శంకర్, కమల్ హాసన్ లకు పోలీసుల నోటీసులు!
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్లో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అరిష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. క్రేన్ ఆపరేటర్ రాజన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మధు (29), చంద్రన్ (60) సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందారు.
డైరెక్టర్ శంకర్తో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే సెట్లో హీరో కమల్హాసన్తో పాటు హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు. ఇలాంటి దుర్ఘటన ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని... చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కమల్ హాసన్.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని.. కోటి రూపాయలు కూడా ప్రకటించారు. ఇక కాజల్ అగర్వాల్ అయితే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రాణం విలువ ఎంత గొప్పదో తనకు తెలిసి వచ్చిందని అన్నారు.
కాగా, స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. క్రేన్ ఆపరేటర్ రాజన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమల్ హాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు. వీరంతా 25వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.