టాలీవుడ్ లో విశాల్ నటించిన ‘పందెం కోడి’అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో తెలుగు, తమిళంలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్. అయితే విశాల్ తెలుగు హీరో అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. విశాల్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ‘పందెం కోడి’ సీక్వెల్ గా తెరకెక్కిన ‘పందెం కోడి 2’ మూవీ నుండి శనివారం నాడు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో ‘జాతరలో పులి వేషాలు వేయొచ్చు కానీ.. పులి ముందే వేషాలు వేయకూడదు’, ‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండి’ లాంటి డైలాగ్స్ విశాల్ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.
విశాల్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విశాల్ మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై భారీ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాకి ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ .. " కెరియర్ ఆరంభంలో లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి' చేసిన నేను, మళ్లీ 25వ సినిమాగా ఈ సీక్వెల్ చేయడం విశేషం.
ఈ సినిమాలో నా జోడీగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ డ్యాన్సులు మాత్రమే కాదు..ఫైటింగ్స్ కూడా చేసిందని..తన నటన చూస్తే అందరికీ నచ్చుతుందని అన్నాడు విశాల్. 'పందెం కోడి 3' చేస్తే మాత్రం అందులో కూడా కథానాయికగా కీర్తి సురేశ్ నే తీసుకుంటాము. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నటన కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాతో నాకు మరో మంచి హిట్ పడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.